పద్మవిభూషన్‌.. డా.నాగేశ్వర్‌ రెడ్డి బ్యాగ్రౌండ్‌ ఇదే

గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులలో ఆయన ఒకరు. ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు. ఏకంగా 1050కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయన స్పృశించని

  • Written By:
  • Publish Date - January 27, 2025 / 01:32 PM IST

గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులలో ఆయన ఒకరు. ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు. ఏకంగా 1050కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఆయన స్పృశించని అంశమంటూ లేదనే ఖ్యాతిని గడించారు. ఆయనే ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్న డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డిని ఇప్పుడు దేశంలోనే రెండో ప్రఖ్యాత అవార్డ్‌ పద్మవిభూషన్‌ వరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వర్‌రెడ్డి కర్నూలు మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్, మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఎండీ, చంఢీగఢ్‌లో PGIMER డీఎం పూర్తి చేశారు. నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిని స్థాపించారు. ప్రస్తుతం 40 రకాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలందిస్తోంది. 4 దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన, వైద్య ఆవిష్కరణలు, విద్య, పరిశోధన, రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను తన వ్యక్తిగత డాక్టర్‌గా పెట్టుకున్నారంటే నాగేశ్వర్‌ రెడ్డి ఏ స్థాయి నైపుణ్యం ఉన్న వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.

జీఐ ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. పెరోరల్‌ ఎండోస్కోపిక్‌ మయోటమీని పరిచయం చేసిన తొలి వైద్యుడు నాగేశ్వరరెడ్డి. ఎండోస్కోపీ పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు నాగిస్టంట్‌ అభివృద్ధి చేశారు. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పని చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్, ఐఐఐటీ హైదరాబాద్‌ ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులపై పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కొవిడ్‌ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి, ఆయన బృందం వైరస్‌పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది.

కొవిడ్‌-19 రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రొటోకాల్‌ అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్‌లైన్స్‌ బుక్‌ రిలీజ్‌ చేశారు. ఆ పుస్తకం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు, వైద్యులకు కొవిడ్‌ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది. పెద్దలకు ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు, చికిత్సలు అందించారు. అంతర్జాతీయంగా నాగేశ్వర్‌ రెడ్డి పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1995 లో బీసీరాయ్‌ అవార్డు, 2002లో పద్మశ్రీ, 2009లో మాస్టర్‌ ఎండోస్కోపిస్ట్‌ అవార్డు, 2013లో మాస్టర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్‌ అవార్డును నాగేశ్వరరెడ్డి అందుకున్నారు. 2016లో పద్మభూషణ్‌, 2021లో జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్‌ వి.షిండ్లర్‌ అవార్డు నాగేశ్వర్‌రావును వరించింది. ఇప్పుడు ఆయన విజయ కిరీటంలో మరో మణి పద్మవిభూషణ్‌ చేరింది.